చెన్నై : తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్లో సీడీఎస్ బిపిన్ రావత్ ఉన్నారని వినడం షాక్కు గురిచేసిందని అన్నారు. హెలికాఫ్టర్ కూలిన ఘటనలో ప్రతిఒక్కరూ సురక్షితంగా బయటపడాలని వారంతా క్షేమంగా ఉండాలని ప్రార్ధిస్తున్నానని గడ్కరీ ట్వీట్ చేశారు.
కాగా హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కి పెరిగింది. ఈ విమానంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తున్నారు. ఆర్మీ హెలికాఫ్టర్ బుధవారం సులూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళుతుండగా కూనూర్ వద్ద కుప్పకూలింది. హెలికాఫ్టర్ కూలిన సమయంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు అలుముకుంది. ప్రమాద ఘటనపై వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది.