ఒకానొక సమయంలో ఇప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏకంగా రిలయన్స్ గ్రూప్స్కే ఝలక్ ఇచ్చారా? ఆ సంస్థకు సంబంధించిన టెండర్ను నిరాకరించారా? అవునట. ఈ విషయాన్ని నితిన్ గడ్కరీయే స్వయంగా వెల్లడించారు. ముంబైలో రవాణా శాఖకు చెందిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. 1995 లో తాను మంత్రిగా ఉన్న సమయంలో ముంబై- పూణె ఎక్స్ప్రెస్ హైవే విషయంలో రిలయన్స్ సంస్థ వేసిన టెండర్ను నిరాకరించానని ఆయన వెల్లడించారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి శివసేన సీనియర్ నేత మనోహర్ జోషి తన మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్థాకరే కూడా తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు.
”ఈనాటి ఈ సెమినార్ నా గతాన్ని గుర్తు చేస్తోంది. 1995 లో నేను మహారాష్ట్రలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఆ సమయంలో ముంబై- పూణె హైవే ఎక్స్ప్రెస్ విషయంలో రిలయన్స్ సంస్థ వేసిన టెండర్ను నేను వ్యతిరేకించా. అప్పుడు రిలయన్స్ చైర్మన్ ధీరూబాయ్ అంబానీ. మా ముఖ్యమంత్రి (మనోహర్ జోషి) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శివసేన అధ్యక్షుడు బాలాసాహెబ్ థాకరే కూడా నాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు చేశావని సీఎం వివరణ కోరారు. ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి, బాంద్రా- వర్లీ లింక్కు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తా అని ఆయనతో చెప్పాను. దీంతో సీఎం బిగ్గరగా నవ్వేశారు. వీలైనంత మేర చేయు అని సీఎం ఆదేశించారు” అని గడ్కరీ పేర్కొన్నారు.