Nitin Gadkari | భారతదేశాన్ని గ్రీన్ ఎకనామీగా మార్చడంలో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించి.. 36కోట్లకుపైగా పెట్రోల్, డీజిల్ వాహనాలను వదిలించుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోల్, డీజిల్ కార్లను పూర్తిగా వదిలించుకోవడం భారత్కు సాధ్యమేనా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘వందశాతం. అసాధ్యం కాదు. ఇది నా అభిప్రాయం’ అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంధన దిగుమతులపై భారతదేశం రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఈ సొమ్ముతో రైతుల జీవితాలు బాగుపడుతాయని.. గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, యువతకు ఉపాధి లభిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు.
గ్రీన్ ఎనర్జీ లక్ష్యం సాధించేందుకు ఎలాంటి టైమ్లైన్ లేదన్నారు. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని ఐదు శాతానికి, ఫ్లెక్స్ ఇంజిన్లపై 12 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపామని, ఈ డిమాండ్ను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశం ఇంధన దిగుమతులను తగ్గించగలదని తాను బలంగా నమ్ముతున్నానన్నారు. తాను 2004 నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెడుతున్నానని, రానున్న ఐదు నుంచి ఏడేళ్లలో పరిస్థితులు మారతాయని గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ మార్పును ఎప్పటిలోగా తీసుకువస్తామో చెప్పలేనన్నారు. ఎందుకంటే ఇది చాలా కష్టంతో కూడకున్నదని.. కానీ అసాధ్యం మాత్రం కాదని గడ్కరీ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఎంత వేగంతో ప్రవేశపెడుతున్నాయో.. రాబోయే కాలంలో ప్రత్యామ్నాయ, జీవ ఇంధనాలు అందుబాటులోకి వస్తాయని, ఈ కల నిజమవుతుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. బజాజ్, టీవీఎస్, హీరో వంటి ఆటో కంపెనీలు కూడా ఫ్లెక్స్ ఇంజిన్లను ఉపయోగించి మోటార్సైకిళ్లను తయారు చేయాలని యోచిస్తున్నాయని గడ్కరీ తెలిపారు.
త్వరలో ఆటో రిక్షాలు కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించబోతున్నాయని తెలిపారు. తాను ప్రస్తుతం హైడ్రోజన్తో నడిచే కారులో ప్రయాణిస్తున్నానని తెలిపారు. ప్రతి రెండో ఇంట్లో కరెంటుతో నడిచే కార్లను చూడొచ్చని.. ఇది అసాధ్యం అని చెప్పేవారు ఇప్పుడు వారి ఆలోచనలను మార్చివేసిందన్నారు. టాటా, అశోక్ లేలాండ్ హైడ్రోజన్తో నడిచే ట్రక్కులను ప్రవేశపెట్టాయన్నారు. ఎల్ఎన్జీ, సీఎన్జీతో నడిచే ట్రక్కులు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 350 బయో సీఎన్జీ ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలిపారు. ఇంధన దిగుమతి ముగుస్తుందని.. దేశం ఆర్థిక స్వావలంభన సాధిస్తుందని.. ఈ విషయంలో పూర్తి విశ్వాసం ఉందన్నారు.