Nirmala Sitaraman : దేశంలో ఇంధన ధరలు (Fuel prices) పెరుగుతుండటంపై కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) స్పందించారు. పశ్చిమాసియా (West Asia) సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉందని చెప్పారు. కానీ కొందరు పనిగట్టుకొని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. దేశం అంతర్జాతీయంగా సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ ఇలాంటి చర్యలు తగవని హితవు పలికారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని అంటున్నారని, కానీ అలాచేస్తే ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుందని తెలిపారు.
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 37వ వార్షికోత్సవంలో మాట్లాడిన మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉందని చెప్పారు. కానీ కొంతమంది అంతా మునిగిపోతోందనేలా భయాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాహుల్గాంధీ.. దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కోబోతోందని హెచ్చరించారు. ఈ హెచ్చరికలకు నిర్మలాసీతారామన్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
పశ్చిమాసియా సంక్షోభం మొదలై మూడు నెలలు కావస్తున్న తరుణంలో ప్రభుత్వం ‘3-ఎఫ్’ (Fuel, Fertilizer, Forex – ఇంధనం, ఎరువులు, విదేశీ మారకం) పై ప్రత్యేక దృష్టి సారించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయ ఒత్తిళ్లవల్ల ఎరువుల ధరలు ఊహించని స్థాయికి చేరాయని, బంగారం ధరలు పెరగడం కూడా సవాలుగా మారిందని చెప్పారు. బయటి సంక్షోభాలను తట్టుకునేలా మోదీ నేతృత్వంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సవాళ్లు అన్నీ అంతర్జాతీయ పరిస్థితులవల్ల వచ్చినవేనని, దేశీయంగా ఆర్థిక పరిస్థితి సానుకూలంగానే ఉందని చెప్పారు.
సామాన్య ప్రజలు సాధిస్తున్న విజయాలను మరిచిపోయి కొందరు కేవలం నెగటివిటీని ప్రచారం చేయడం సరికాదని మంత్రి అన్నారు. మన దేశం ఇలాంటి భయానక ప్రచారాలను భరించలేదని, మన మాటలు, చేతల ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.