Union Budget | న్యూఢిల్లీ, జనవరి 31: కొద్ది నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్లో గురువారం ఉదయం 11 గంటలకు ఆమె తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యంతర బడ్జెట్లో తాయిలాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని, మహిళా సాధికారిత పెరగాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ సారి బడ్జెట్లో వారికి పెద్దపీట వేయొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.
అలాగే కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలతో రైతులలో ఉన్న వ్యతిరేకతను చల్లార్చడానికి వారికి తాయిలాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఆదాయపు పన్నులో మరింత ఊరట ఇవ్వాలని వేతన జీవులు కోరుతున్నారు. వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మల.. ప్రధాని మోదీ 10 ఏండ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమం, దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానాలను వివరించే రాజకీయ పత్రంగా ఈ బడ్జెట్ ఉంటుందని పలువురు ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సాంకేతికంగా ఓటాన్ అకౌంట్గా వ్యవహరించే ఈ మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్న కేటాయింపులకు ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి నాలుగు నెలల పాటు నిధులను ఖర్చు చేయడానికి పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. ఏప్రిల్/మే నెలలో కొత్త ప్రభుత్వం ఎన్నికైన తర్వాత బహుశా జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు.
అయోధ్యలో రామమందిరం నిర్మించాలన్న శతాబ్దాల కలను మోదీ ప్రభుత్వం సాకారం చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్సభ చాంబర్లో మాట్లాడుతూ గత పదేండ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను చెప్పుకొచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దీటైన జవాబునిచ్చిన సాయుధ దళాల సేవలను కొనియాడారు. గత పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ఆర్థిక సంస్కరణలను ప్రస్తావించారు. పదేండ్లకు ముందు ఐదు బలహీన దేశాల జాబితాలో ఉన్న భారత్ ఇప్పుడు ఐదు సంపన్న దేశాల జాబితాలో చేరిందని చెప్పారు.