Nirmala Sitaraman : కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలాసీతారామన్ (Nirmala Sitaraman) కాసేపట్లో 30 మంది విద్యార్థులను కలువనున్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ (Budget 2026-27) ను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం ఉదయం 11 గంటలకు లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ విధివిధానాలు, రూపకల్పన విషయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొంతమంది విద్యార్థులకు అవకాశం కల్పించింది. ఇందుకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలల నుంచి 30 మంది విద్యార్థులను ఎంపికచేసినట్లు తెలిసింది.
ఎంపిక చేసిన 30 మంది విద్యార్థులు లోక్సభ గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా బడ్జెట్ ప్రసంగాన్ని విన్నారు. కాసేపట్లో వీరిని మంత్రి కలువనున్నారు. కర్తవ్య భవన్లోని ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా సందర్శించనున్నారు. ఆర్థిక శాఖ పనితీరు, విధాన రూపకల్పన ప్రక్రియలు, అత్యున్నత స్థాయిల్లో ఆర్థిక నిర్ణయాలు ఎలా రూపొందిస్తారు..? అమలు చేస్తారు..? అనే విషయాలను ఆ విద్యార్థులు తెలుసుకోనున్నారు.
పరిపాలనకు సంబంధమైన విషయాలపై విద్యార్థుల్లో అవగాహన తీసుకురావడానికి కేంద్రం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థులతో సమావేశమై.. బడ్జెట్పై వారి అభిప్రాయాలను, సూచనలను తెలుసుకోనున్నారు.