Encounter | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు హతమైనట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళా దళ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47తో సహా భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు, జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త భద్రతా బృందానికి మధ్య మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా అధికారులు తెలిపారు.
నారాయణపూర్, కాంకేర్ సరిహద్దు ప్రాంతంలోని అబుజ్మర్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సోమవారం ఆపరేషన్ కోసం బయలుదేరాయి. టెక్మెటా, కాకూర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. మహిళా మావోయిస్టులతో సహా మొత్తం తొమ్మిది మంది మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. వాటి గుర్తింపు పనులు కొనసాగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. మావోయిస్టుల శిబిరం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఓ ఏకే 47తో సహా నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగులుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో కాంకేర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. మృతుల్లో సీనియర్ నేత శంకర్రావు సైతం ఉన్నారు. 16న బినాగుండ, కొరోనార్ గ్రామాల మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్ చరిత్రలో మావోయిస్టులు ఒకేసారి ఇంతమంది ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.