బెంగుళూరు: కర్నాటకలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక స్కూళ్లను కూడా సోమవారం నుంచి తెరవనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. బెంగుళూరులో స్కూళ్లు ఓపెన్ అవుతాయని, అయితే కరోనా నిబంధనలు పాటించే విధంగా అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. మ్యారేజ్ వేడుకలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. ఇండోర్లో జరిగే పెళ్లి వేడుకలకు 200 మంది, ఔట్డోర్లో జరిగే వేడుకలకు 300 మందిని అనుమతించనున్నారు.
జిమ్లను 50 శాతం సామర్థ్యంతో తెరవనున్నారు. బార్లు, హోటళ్లను ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు నూరు శాతం ఉద్యోగులతో పనిచేయనున్నట్లు మంత్రి నరేశ్ తెలిపారు. ఆలయాల్లో పూజలకు కూడా అనుమతి ఇచ్చారు. అయితే ధర్నాలు, మతపరమైన, రాజకీయమైన కార్యక్రమాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదని మంత్రి చెప్పారు. క్రీడా మైదానాలు, స్టేడియంల్లో 50 శాతానికి అనుమతి ఇచ్చారు.