బెంగళూర్ : కరోనా మహమ్మారి అన్ని రంగాలపైనా పెను ప్రభావం చూపింది. మహమ్మారి కట్టడికి నేటి నుంచి 130 రోజుల పాటు నైట్ కర్ఫ్యూ అమలు కానుండటంతో పబ్లు, హోటళ్లు సహా ఆతిథ్య రంగానికి మళ్లీ సవాళ్లు ఎదురువుతున్నాయి. వారాంతపు లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలు కొనసాగుతుండటంతో నగరంలో ఆర్ధిక కార్యకలాపాలు ఎప్పుడు కుదుటపడతాయా అనే ఆందోళన వ్యాపార వర్గాలను వేధిస్తోంది.
తదుపరి వేవ్లు తలెత్తకుంటే అదే చాలని మరికొందరు సర్ధిచెప్పుకుంటున్నారు. కరోనా నియంత్రణల నేపధ్యంలో వ్యాపార కార్యకలాపాలు మందకొడిగా సాగుతుండటంతో లిక్కర్ స్టోర్లకు నూతన లైసెన్సుల జారీని నిలిపివేసినట్టు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. మరోవైపు హోటల్ పరిశ్రమ సైతం మహమ్మారి ప్రభావంతో కుదేలైంది.
నియంత్రణలపై హోటల్ పరిశ్రమ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. వైరస్ కేవలం రాత్రి వేళల్లో, వారాంతాల్లోనే వ్యాప్తి చెందుతోందా అని బెంగళూర్ హోటల్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పీసీ రావు ప్రశ్నించారు. రాత్రి సమయంలో కాకుండా పగటి పూట కర్ఫ్యూ విధించాలని అది తమ వ్యాపారాలకు ఉపకరిస్తుందని ఆయన కర్నాటక ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.