న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చండీఘడ్ రాష్ట్రాల్లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ ఇవాళ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లతో లింకున్న కేసులో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలు ఈ భారీ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఉగ్రవాదం కేసు విచారణలో భాగంగా అనుమానిత ఇండ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
జనవరి ఆరో తేదీన ఉగ్రవాదం, గ్యాంగ్స్టర్, డ్రగ్ స్మగ్లింగ్కు చెందిన భారీ కుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు చెందిన నాలుగు ప్రాపర్టీలను సీజ్ చేశారు. 1967 నాటి యూఏపీఏ చట్టం కింద ఆ ఆస్తుల్ని జప్తు చేశారు. అక్రమంగా వస్తున్న నిధుల్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.