న్యూఢిల్లీ, నవంబర్ 8: దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లో ఎన్ఐఏ బుధవారం దాడులు చేసింది. మానవ అక్రమ రవాణాతో సంబంధమున్న 44 మందిని అరెస్ట్ చేసింది. సరిహద్దు భద్రతా దళం, రాష్ట్ర పోలీసులతో కలిసి దాడులు నిర్వహించినట్టు ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా దేశంలోకి చొరబాట్లు, అక్రమ వలసలు, మానవుల అక్రమ రవాణా జరుగుతున్నదని, దీని నిరోధంలో భాగంగా ఈ దాడులు చేసినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా తెలంగాణ, త్రిపుర, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, జమ్ము-కశ్మీర్ తదితర రాష్ర్టాలు, యూటీల్లోని 55 ప్రదేశాల్లో తనిఖీలు, దాడులు చేశామన్నారు.