న్యూఢిల్లీ : బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మంగళవారం నోటీసులు జారీ చేసింది. కైమూర్ జిల్లాలో వృద్ధ ఉపాధ్యాయుడిని పోలీసులు చితకబాదిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు మహిళా పోలీసులు ఉపాధ్యాయుడిపై లాఠీలతో చితకబాదినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు బీహార్ చీఫ్ సెక్రెటరీతో పాటు డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
బాధ్యులైన పోలీస్ సిబ్బందిపై నమోదైన ఎఫ్ఐఆర్తో పాటు తీసుకున్న చర్యలకు సంబంధించిన కాపీని సైతం జతచేయాలని, ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి గురించి సైతం తీసుకోవాలనుకుంటున్నట్లు కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గత శుక్రవారం కైమూర్ జిల్లా భభువాకు చెందిన కిశోర్ పాండే (65) అనే ఉపాధ్యాయుడు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. మండల్ జైలు సమీపంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ను ఇద్దరు మహిళా పోలీసులు కంట్రోల్ చేస్తుండగా.. ఈ క్రమంలోనే వృద్ధ ఉపాధ్యాయుడు కాలినడకన రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు.
మహిళా పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీసులిద్దరూ వృద్ధ ఉపాధ్యాయుడిపై కర్రలతో దాడి చేశారు. పలువురు ఈ దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించగా.. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని నోటీసులు జారీ చేసింది. పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని, విధి నిర్వహణలో సంబంధం లేనివిధంగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.