పట్నా: బీహార్లో కల్తీ మద్యం సేవించి 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా తీసుకుంది. ఘటనకు సంబంధించి గత మూడు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా కేసును సుమోటోగా తీసుకున్నట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలిపింది.
బీహార్ రాష్ట్రం సరాన్ జిల్లాలో గత మంగళవారం రాత్రి కల్తీ మద్యం సేవించి పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూనే ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నానికి ఈ దుర్ఘటనకు సంబంధించిన మరణాల సంఖ్య 60కి చేరింది. ఇంకా పలువురి పరిస్థితి విషమంగానే ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.