న్యూఢిల్లీ : ప్రస్తుతం నెలకొన్న ఎల్నినో పరిస్థితులు ఏప్రిల్, 2024 వరకు కొనసాగుతాయని, దీంతో భూ ఉపరితలం, సముద్ర జలాలపై ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంవో) తాజాగా వెల్లడించింది. ‘జూలై-ఆగస్టులో ఎల్నినో మార్పులు వేగాన్ని అందుకున్నాయి. నవంబర్లో బలంగా మారి, జనవరి 2024 నాటికి ఎల్నినో అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఉత్తరార్థ గోళంలో శీతాకాలంలో, దక్షిణార్థ గోళంలో వేసవికాలంలో ఎల్నినో పరిస్థితులు కొనసాగే అవకాశం 90 శాతం వరకు ఉన్నాయి’ అని డబ్ల్యూఎంవో తన అంచనాల్ని విడుదల చేసింది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలపై ఉంటుందని తెలిపింది. అత్యంత వేడి సంవత్సరంగా 2023 రికార్డ్ సృష్టించగా, 2024లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని అంచనా వేసింది. అత్యంత వేడిగాలులు, కరువు పరిస్థితులు, అడవుల్లో కార్చిచ్చు, హఠాత్తుగా కుండపోత వర్షాలు..కొన్ని ప్రాంతాల్ని చుట్టుముడుతాయని పేర్కొన్నది.