నేషనల్ డెస్క్;రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలని కమలదళం విశ్వప్రయత్నాలు చేస్తున్నది. దేశంలోని 18 రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన మెజారిటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సొంతంగా లేదు. అందుకే తటస్థంగా ఉన్న వైసీపీ, బీజేడీ మద్దతు కోసం వ్యూహాలు రచిస్తున్నది. అయితే, మిత్రపక్షాలైన జేడీయూ, అన్నాడీఎంకే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తాయా? అన్న అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే ఈ అనుమానాలకు కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఎన్డీయే బలమెంత?
రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4,809 మంది ఓటర్లుగా పాల్గొనబోతున్నారు. 776 మంది ఎంపీల ఓటు విలువ 5,43,200. ఇక, 4,033 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 5,43,231. మొత్తం ఓట్ల విలువ 10,86,431.ఇందులో ఎన్డీయేకు 5,35,000 ఓట్లు (49.24%) ఉన్నాయి. మిగిలిన 5,51,431 ఓట్లు (50.76 శాతం) విపక్షాల ఖాతాలో ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి గెలుపునకు కనీసం 5,43,217 ఓట్లు అవసరం. ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఇంకా 8,217 ఓట్లు అవసరం. అయితే, మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ (ఓట్ల విలువ 18,639), అన్నాడీఎంకే (ఓట్ల విలువ 13,900) ఎన్డీయేకు మద్దతు ఉపసంహరిస్తే మ్యాజిక్ ఫిగర్కు మరింత దూరంగా (40,756) కమలదళం కూటమి ఉండిపోతుంది.
మద్దతు ఎందుకు ఇవ్వకపోవచ్చు?
రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు ఇవ్వకపోవడానికి విశ్లేషకులు పలు కారణాలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కులగణనకు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నది. అయితే, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న కమలదళాన్ని కాదని బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కులగణనపై అన్ని పక్షాలతో ఇటీవల భేటీ నిర్వహించారు. నితీశ్ వైఖరిపై రాష్ట్ర బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమైనప్పటికీ నితీశ్ వాటిని అంతగా పట్టించుకోలేదు. అలాగే, అయోధ్యలో పర్యటిస్తానని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ప్రకటించినప్పుడు బీజేపీ అభిప్రాయాలకు విరుద్ధంగా జేడీయూ ఆ ప్రకటనను ఖండించింది.
దీనిపై నిరసన కూడా వ్యక్తం చేసింది. రాజ్యసభ ఎన్నికల బరిలో అభ్యర్థులను దింపే ప్రక్రియలో కూడా ఇరు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు, ఎంతోకాలం గా మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, అన్నాడీఎంకే మధ్య ఇటీవల పొరపచ్చాలు బయటపడ్డాయి. హిందీ-తమి ళ్ వివాదం, నీట్ మెడికల్ అడ్మిషన్ల వంటి అంశా ల్లో బీజేపీకి వ్యతిరేకంగా అన్నాడీఎంకే నిర్ణయాలు తీసుకున్నది. తమిళంపై హిందీ పెత్తనాన్ని ప్రోత్సహిస్తున్న బీజేపీ.. తమిళనాడులో ఎప్పటికీ ఎదుగలేదని అన్నాడీఎంకే నేతలు విమర్శించడం ఈ రెండు పార్టీల మైత్రికి చెల్లుచీటీ పలకనున్న సంకేతాలు ఇచ్చింది.
అంతుచిక్కని జేడీయూ వైఖరి
రాష్ట్రపతి ఎన్నికల్లో జేడీయూ నిర్ణయాలు విచిత్రంగా ఉంటాయి. గడిచిన రెండు దఫాల ఎన్నికలు పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. 2012లో జేడీయూ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నది. ఆ ఏడాది జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పీఏ సంగ్మా బరిలో నిలిచారు. యూపీఏ బలపరిచిన ప్రణబ్ ముఖర్జీకి అనూహ్యంగా జేడీయూ మద్దతిచ్చింది. 2017లో యూపీయే మిత్రపక్షంగా జేడీయూ ఉన్నది. ఈ సమయంలో జరిగిన ఎన్నికల్లో యూపీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న మీరాకుమార్ను కాదని, ఎన్డీయే అభ్యర్థి కోవింద్ను జేడీయూ బలపరిచింది. మిత్రపక్షం కంటే, బరిలో నిలిచిన అభ్యర్థిని బట్టే తమ మద్ద తు ఉంటుందని జేడీయూ నేతలు తెలిపారు.