న్యూఢిల్లీ: న్యూస్ క్లిక్(NewsClick) వెబ్సైట్కు చెందిన జర్నలిస్టులపై ఇవాళ ఢిల్లీ పోలీసులు విచారణ చేపడుతున్నారు. చైనా నుంచి ఆ సంస్థకు అక్రమ రీతిలో నిధులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వెబ్సైట్ను 2009లో ప్రారంభించారు. న్యూస్తో పాటు కరెంట్ అఫైర్స్ను ఈ సైట్లో అప్లోడ్ చేస్తుంటారు. అయితే కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ఈ వెబ్సైట్లో వార్తలు వస్తుంటాయి. విదేశీ నిధుల చట్టాన్ని ఆ సంస్థ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో గతంలో ఆదాయశాఖ అధికారులు తనిఖీలు కూడా చేశారు.
ఇవాళ రెయిడ్లో భాగంగా ఆ వెబ్సైట్ ఎడిటర్ ప్రబిర్ పుర్కయస్తా ఇంటికి పోలీసులు వెళ్లారు. జర్నలిస్టులు అభిసర్ శర్మ, అనింద్యో చక్రవర్తి, భాషా సింగ్, సెటైరిస్టు సంజయ్ రాజౌరా, చరిత్రకారుడు సోహెయిల్ హస్మిలపై ఇండ్లపై కూడా ఇవాళ పోలీసులు విచారణ చేపట్టారు. కొందర్ని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు. ఢిల్లీలో ఉన్న వెబ్సైట్ ఆఫీసులో ఇంకా సోదాలు జరుగుతన్నాయి.
ఆగస్టులో న్యూస్ క్లిక్పై నమోదు అయిన కేసు ఆధారంగా ఇవాళ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా మిలియనీర్ నుంచి ఆ సంస్థకు భారీ మొత్తంలో నిధులు అందినట్లు గతంలో న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని రాసింది. చైనా గురించి ప్రచారం చేసేందుకు ఆ మిలియనీర్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెవిల్లీ రాయ్ సింఘం అనే వ్యక్తి చైనా సర్కారుతో కలిసి పనిచేశాడని, ఆ నెట్వర్క్తో అతను ఎన్జీవో, షెల్ కంపెనీల ద్వారా చైనా గురించి ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీన న్యూస్ క్లిక్పై కేసు బుక్ చేశారు.
ఇటీవల కేంద్ర ఆదాయశాఖ అధికారులు.. బీబీసీ ఆఫీసుల్లో తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ గురించి డాక్యుమెంటరీ ప్రసారం చేసిన నేపథ్యంలో ఆ దాడులు జరిగినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. 2021లో పన్ను ఎగవేసిన కేసులో దైనిక్ భాస్కర్ పత్రికపై కూడా సోదాలు నిర్వహించారు. భారత్లో మీడియా స్వేచ్ఛ లేదని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే జర్నలిస్టుల సంస్థ ఆరోపించింది. ఆ ర్యాంకింగ్స్లో ఇండియా 161 స్థానంలో ఉంది. దేశంలో మీడియా స్వేచ్ఛ సమస్యాత్మక స్థాయి నుంచి అధ్వాన్న స్థాయికి చేరుకున్నట్లు ఆరపించారు. తజకిస్తాన్, టర్కీ కన్నా దారుణంగా ఉందన్నారు. న్యూస్ క్లిక్ కేసులో సుమారు 30 ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నాయి.