Mehul Choksi | పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణ మోసం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్టు అయ్యారు. ఆయనని భారత్కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు గతకొంతకాలంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీబీఐ విజ్ఞప్తి మేరకు ఆయనను శనివారం అరెస్టు చేసినట్లు పలు మీడియా నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన బెల్జియం జైలులో ఉన్నట్లు సమాచారం. ముంబయి కోర్టు జారీ చేసిన రెండు అరెస్టు వారెంట్ల ఆధారంగా అరెస్టు చేసినట్లు సమాచారం. 2018 మే 23న తొలిసారి.. 2021 జూన్ 15న రెండోసారి వారెంట్లు జారీ అయ్యాయి.
అయితే, మెహుల్ చోక్సీ ఆరోగ్యం సరిగా లేదని.. దాంతో ఆయనను ఎక్కువ రోజులు జైలులో ఉండే అవకాశం లేదని.. కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,500కోట్ల రుణ మోసం కేసులో మెహుల్ చోక్సీ సైతం నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య ప్రీతి చోక్సీతో కలిసి బెల్జియంలోని ఆంట్వెర్ప్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం సైతం ఉంది.
వైద్య చికిత్సల కోసం ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ సైతం ఈ కేసులో నిందితుడు. ఆయన లండన్లో ఉండగా.. భారత్కు రప్పించే ప్రక్రియ కొనసాగుతున్నది. దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగిన కుంభకోణం వెలుగులోకి రావడానికి కొన్ని వారాల ముందు జనవరి 2018లో భారత్ నుంచి పారిపోయారు. అయితే, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీని భారత్కు రప్పించేందుకు సీబీఐతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.