న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశంలో కొత్తగా 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ రుణ పరపతి సంఘాలు (పీఏసీఎస్), పాల, మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయడానికి బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇంతకుముందు వీటిని ఏర్పాటు చేయని గ్రామాలు, పంచాయతీలలో నెలకొల్పుతారు. ఇప్పటివరకు దేశంలో 90 వేల పీఎసీఎస్లు ఉండగా, అందులో 63 వేలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. ఒక్క పీఏసీఎస్ కూడా లేకుండా1.6 లక్షల పంచాయతీలు, ఒక్క డెయిరీ కో-ఆపరేటివ్ సొసైటీ కూడా లేకుండా 2 లక్షల పంచాయతీలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
సరిహద్దుల్లో భద్రత పెంపునకు ఏడు కొత్త బెటాలియన్లను కేంద్ర క్యాబినెట్ మంజూరు చేసింది. లఢక్లో చైనాతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 9,400 మందితో కొత్తగా ఈ బెటాలియన్లను భారత్-చైనా వాస్తవాధీన రేఖ వెంబడి నియమిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు మరోవైపు, వైబ్రంట్ విలేజెస్ కింద సరిహద్దుల్లోని గ్రామాల అభివృద్ధికి రూ. 4,800 కోట్లు వెచ్చించనున్నారు.