బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువును కుక్కలు పాక్షికంగా తినేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ పసికందు మరణించింది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాండ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంఐఎంఎస్) వార్డు నంబర్ 7 సమీపంలో ఒక రోజు పసి పాపను కుక్కలు పాక్షికంగా పీక్కు తిన్నాయి. చిట్టి శరీరాన్ని ఛిద్రం చేశాయి. గమనించిన అక్కడి వారు ధైర్యం చేసి ఆ కుక్కల బారి నుంచి పసి పాపను కాపాడారు. అయితే కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ నవజాత శిశువు అనంతరం చనిపోయింది.
కాగా, ఒక రోజు కిందట వైకల్యంతో పుట్టిన ఆ పసి పాపను తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద వదిలేశారని వైద్యులు ఆరోపించారు. ఆ శిశువు తమ ఆసుపత్రిలో జన్మించలేదని చెప్పారు. సెప్టెంబర్ 1-5 మధ్య పుట్టిన వారిలో నలుగురు శిశువులు చనిపోయినట్లు వివరించారు. ఇందులో ముగ్గురు బాబులు, ఒక పాప ఉన్నట్లు వెల్లడించారు. చనిపోయిన పసిపాపకు అంత్యక్రియలు నిర్వహించినట్లు తల్లిదండ్రులు చెప్పారన్నారు. దీంతో కుక్కలు దాడి చేసిన శిశువును ఎవరో ఆసుపత్రి వద్ద వదిలేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు ఆసుపత్రి వర్గాలు, పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. అలాగే పసిపాపపై కుక్కలు దాడి చేసి పాక్షితంగా తినేయడం, తీవ్ర గాయాల వల్ల శిశువు చనిపోయిన సంఘటనపై మాండ్య నగరంలోని వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.