న్యూఢిల్లీ: ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనికుల మధ్య సోదరభావం వెల్లివిరిసింది. రెండు దేశాల సైనికులు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని నాలుగు వేర్వేరు క్రాసింగ్ పాయింట్లలో ఇరుదేశాల సైనికులు కలిసి కొత్త సంవత్సర సంబురాలు చేసుకున్నారు.
నియంత్రణ రేఖ వెంట ఉన్న మెంధార్ హాట్ స్ప్రింగ్స్ క్రాసింగ్ పాయింట్, పూంచ్ రావ్లాకోట్ క్రాసింగ్ పాయింట్, చకోటి ఉరి క్రాసింగ్ పాయింట్, చిల్లియానా తిత్వాయ్ క్రాసింగ్ పాయింట్లలో భారత్-పాకిస్థాన్ సైనికాధికారులు న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నారు.