Vande Bharat Train | భారతీయ రైల్వేశాఖ కొత్తగా మరో రూట్లో వందే భారత్ రైలును ప్రవేశపెట్టనున్నది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైలు దేశవ్యాప్తంగా 50కిపైగా మార్గాల్లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ కొత్త రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలోనే మరికొద్ది మార్గాల్లో రైల్వేశాఖ సెమీ హైస్పీడ్ రైళ్లకు శ్రీకారం చుట్టబోతున్నది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL)లో కశ్మీర్ నుంచి న్యూఢిల్లీకి అనుసంధానించే వందే భారత్ రైలును వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ తెలిపారు. ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన చీనాబ్ రైలు వంతెనగుండా వెళ్తుందని పేర్కొన్నారు.
272 కిలోమీటర్ల యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్ట్లో రైల్వే 255 కిలోమీటర్ల పూర్తయ్యింది. కత్రా, రిసియా మధ్య 17 కిలోమీటర్లు డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఈ ఏడాది చివరి వరకు ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని పరిశీలించాల్సి ఉందని.. ఇప్పటికే సాంకేతిక బృందాలు తనిఖీ చేసి ప్రామాణికంగా ఉండేలా చూస్తున్నారన్నారు. ప్రధాని షెడ్యూల్ ప్రకారం.. జనవరిలో వందే భారత్ రైలు ప్రారంభోత్సవం ఉంటుందని రైల్వేమంత్రి రవ్నీత్ సింగ్ పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతే ప్రారంభోత్సవం తేదీని నిర్ణయించన్నట్లు మంత్రి పేర్కొన్నారు. చలికాలంలో హైవేపై ట్రక్కులు, వాహనాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు లోయలో ప్రజలకు ఎంతో ఊరట కలుగుతుందన్నారు.
పర్యాటకానికి ప్రోత్సాహకం అందిస్తుందన్నారు. ఇది కశ్మీర్ ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి ఇచ్చిన బహుమతి అని పేర్కొన్నారు. గతంలో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని.. గత ఎనిమిదేళ్లలో పనులు వేగవంతం చేశామన్నారు. ప్రాజెక్ట్లో పాలుపంచుకున్న ఉద్యోగులు, అధికారుల త్యాగాలు, కృషిని మంత్రి గుర్తు చేశారు. డిసెంబరు 25 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ ప్రాజెక్టుపై చర్చిస్తామన్నారు. ఇక వందేభారత్ టికెట్ ధర విషయానికి వస్తే.. ఢిల్లీ నుంచి కశ్మీర్కు కేవలం రూ.1,500 నుంచి రూ.2100గా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రైలు మార్గమధ్యలో జమ్మూ, శ్రీమాతా వైష్ణోదేవి కత్రాలో స్టాప్స్ ఉంటాయన్నారు. ప్రాజెక్టు అపారమైన పర్యాటక సామర్థ్యం కలిగి ఉందని.. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచుతుందన్నారు.