న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుపట్టారు. ఆ విధానం అసంబద్ధంగా ఉందని, వివక్షపూరితంగా ఉన్నట్లు ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు. ఒకే వ్యాక్సిన్ను మూడు వేర్వేరు ధరల్లో అమ్మడాన్ని సోనియా తప్పుపట్టారు. ఈ అంశంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని కోరారు. సీరం సంస్థ తమ వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు హాస్పిటళ్లకు రూ.600కు ఒక డోసు చొప్పున అమ్మనున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిదే. దీన్ని సోనియా ఖండించారు. సీరం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా మోదీ చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. 18 ఏళ్ల వయసు దాటినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్న లక్ష్యం ఉండాలని సోనియా అన్నారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం విస్మరించినట్లు అర్థమవుతోందని ఆమె ఆరోపించారు. తక్షణమే కోవిడ్ వ్యాక్సిన్ పాలసీని సమీక్షించాలని ఆమె ప్రధానిని కోరారు.