న్యూఢిల్లీ: పాముతో కాటు వేయించి హత్య చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్గా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక నిందితుడి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. రాజస్థాన్కు చెందిన ఒక ఇంటి కోడలు అల్పానా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అత్త సుబోధ్ దేవిని ప్రియుడు మనీష్, స్నేహితుడు కృష్ణ కుమార్తో కలిసి పాముతో కాటు వేయించి హత్య చేసింది. 2019 జూన్ 2న జరిగిన ఈ ఘటన నాడు రాజస్థాన్లో కలకలం రేపింది.
తన భార్య మరణంపై అనుమానించిన మామ రాజేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు జరుపగా సుబోధ్ దేవిని పాము కాటు వేసిన రోజు అల్పానా, ఆమె ప్రియుడు మనీష్ మధ్య 124, అల్పానా, కృష్ణ కుమార్ మధ్య 19 ఫోన్ కాల్ సంభాషణలు జరిగినట్లు గుర్తించారు. కొన్ని మెసేజ్లు కూడా వారి మధ్య షేర్ అయ్యాయని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో 2020 జనవరి 4న అరెస్టైన ఈ ముగ్గురు నిందితులు నాటి నుంచి జైల్లో ఉన్నారు.
అయితే సహ నిందితుడైన కృష్ణ కుమార్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిపింది. ‘పాములు పట్టి ఆడించే వారి నుంచి పాములు తెచ్చి కాటు వేయించడం ద్వారా వ్యక్తులను హత్య చేయడం కొత్త ట్రెండ్గా మారింది. ఇది ఇప్పుడు రాజస్థాన్లో సర్వసాధారణమైంది’ అని జస్టిస్ సూర్య కాంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కాగా, ప్రధాన నిందితుడితో కలిసి కృష్ణకుమార్ పాములు పట్టే వ్యక్తి వద్దకు వెళ్లి పది వేలకు పామును కొన్నారని, అయితే ఆ పామును తన స్నేహితుడు దేని కోసం కొంటున్నాడు అన్నది తన క్లైంట్కు తెలియదని అతడి తరుఫు న్యాయవాది ఆదిత్య చౌదరి కోర్టుకు తెలిపారు. పాముతోపాటు ఆ మహిళ ఇంటికి కూడా అతడు వెళ్లలేదన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి అయిన సహ నిందితుడు కృష్ణ కుమార్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు, నిందితుడు కృష్ణ కుమార్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.