న్యూఢిల్లీ : కేంద్రం త్వరలో కొత్త టోల్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నది. ఈ విధానం అమలులోకి వస్తే కారు ప్రయాణికులపై పన్ను భారం తగనున్నట్లు తెలుస్తున్నది. కొత్త టోల్ విధానంలో వాహన పరిమాణం, తిరిగిన దూరం ఆధారంగా పన్ను వసూలు చేసేలా.. ఈ పాలసీలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. కార్లలాంటి చిన్న వాహనాలు రహదారులపై తక్కువ భారం పడే విషయం విధితమే. భారీ టక్కులతో భారీగా రహదారులపై భారీగా లోడ్ పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను సైతం కొత్త పాలసీలో చేర్చనున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ఏ వాహనమైనా ప్రయాణించిన దూరానికి మాత్రమే పన్ను విధించనున్నారు.
ఉదాహారణకు కారు రోడ్డుపై ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుంది ? అది రోడ్డుపై ఎంత భారాన్ని మోపుతుంది? అనే విషయాలను పరిగణలోకి తీసుకొని వాహన పరిమాణం ఆధారంగా టోల్ వసూలు చేయనున్నారు. అయితే, వాహనం రహదారిపై ఒత్తిడి ఎంత మోపుతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్యాసింజర్ కార్ యూనిట్ (PUC)ని లెక్కించాలని.. ఈ విషయమై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH) ఐఐటీ బీహెచ్యూను కోరింది. ఇందులో ఒక కారు రోడ్డుపై ఎంత లోడ్ను మోపుతున్నదో అంచనా వేయనున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా పనులు ప్రారంభం కాలేదని, త్వరలోనే మొదలయ్యే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.