ముంబై: మహారాష్ట్రలో రెండు కొత్త సాలీడు జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో ఒక సాలీడు జాతికి 26/11 ముంబై ఉగ్రవాద దాడిలో మరణించిన ముంబై పోలీస్ అధికారి ఏఎస్ఐ తుకారాం ఓంబుల్ పేరుపెట్టారు. ఆయన గౌరవార్థం ఎగిరే కొత్త సాలీడు జాతుల్లో ఒక దానికి ‘ఐసియస్ తుకారామి’గా నామకరణం చేసి ఆ మేరకు పరిశోధనా పత్రంలో పేర్కొన్నట్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో తెలిపారు.
జంపింగ్ స్పైడర్ రెండవ జాతికి ఫింటెల్లా చోల్కీ అని పేరు పెట్టినట్లు పర్వీన్ వెల్లడించారు. ఈ జాతిని ముంబైలోని థానే, ఆరే మిల్క్ కాలనీలో కనుగొన్నట్లు వెల్లడించారు.
కాగా, 2009లో అశోక్ చక్ర పురస్కారంతో గౌరవం పొందిన ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన పోలీస్ అధికారి తుకారాం ఓంబుల్ను నెటిజన్లు ఈ సందర్భంగా స్మరించుకుని నివాళి అర్పించారు. ఈ కొత్త జాతి సాలీడ్లు ప్రమాదకరమైనవా అంటూ కొందరు ప్రశ్నించారు.