న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆరోగ్య రంగానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్లో పెద్దగా ప్రకటనలేమీ చేయలేదు. కేటాయింపులను కూడా చెప్పుకోదగిన స్థాయిలో పెంచలేదు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగానికి భారీగా నిధులు పెంచుతారని, పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తారని అంతా భావించారు. కానీ, గతేడాదితో పోలిస్తే ఆరోగ్యరంగానికి కేవలం 16% నిధులను మాత్రమే పెంచారు. ఈ బడ్జెట్లో రూ.86,200 కోట్లు కేటాయించారు. హెల్త్ రిసెర్చ్ విభాగానికి కేవలం రూ.3,200 కోట్లు కేటాయించారు. కొత్తగా టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాంను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కౌన్సెలింగ్, మెరుగైన వైద్యం, సేవల కోసం ఈ ప్రోగ్రాంను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 23 టెలి మెంటల్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ నోడల్ సెంటర్గా ఉంటుందని, బెంగళూరు ట్రిపుల్ ఐటీ సాంకేతిక సాయం అందిస్తుందని తెలిపారు.
ఆరోగ్య రంగాన్ని పట్టించుకోలేదు
ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచకపోవడం తీవ్రంగా నిరాశ పర్చింది. కరోనా కారణంగా ప్రస్తుతం దేశంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి నెలకొన్నది. ప్రజలు తమ సంపాదనలో 65% వైద్యానికే ఖర్చు చేస్తున్నారని, వైద్యం పేద, మధ్యతరగతి వారికి పెనుభారంగా మారిందని అనేక సర్వేలు చెప్తున్నాయి. సరైన ప్రజారోగ్య వ్యవస్థ లేకపోవడంతో పెద్ద జబ్బులు వచ్చినప్పుడు అనేక కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయని హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేలా, పేదలకు భరోసా కల్పించేలా బడ్జెట్ ఉంటుందని అందరం భావించాం.
సహకార శాఖకు 900 కోట్లు
కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు బడ్జెట్లో రూ. 900 కోట్లను కేంద్రం కేటాయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ మేరకు నిధులను ఖర్చు చేయనున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంస్థలను బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ కనీస పన్ను (ఏఎంటీ)ని కూడా తగ్గిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 18.5 శాతంగా ఉన్న ఏఎంటీని 15 శాతానికి కుదిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే సర్చార్జీని కూడా 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. రూ. కోటి- రూ. 10 కోట్ల ఆదాయ పరిమితి గల సహకార సంస్థలకు ఈ వెసులుబాట్లు వర్తిస్తాయని వివరించారు. రూ. 10 కోట్లు పైబడి ఆదాయం కలిగిన సహకార సంస్థలకు సర్చార్జీ 12 శాతంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్న 15 శాతం పన్ను రాయితీని 2024 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు, కొత్తగా ఏర్పాటు చేసే తయారీ కంపెనీలకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు నిర్మల పేర్కొన్నారు.
బీఎస్ఎన్ఎల్లోకి 44,720 కోట్లు
నష్టాల్లో కొనసాగుతున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.44,720 కోట్ల మేర నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించింది. 4జీ స్పెక్ట్రం, టెక్నాలజీని ఆధునీకరించడానికి, పునర్ వ్యవస్థీకరణకోసం ఈ నిధులను కేటాయించినట్లు బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొంది. వీటితోపాటు వీఆర్ఎస్ కోసం రూ.7,445.57 కోట్లు, జీఎస్టీ కింద మరో రూ.3,550 కోట్ల నిధులను కేటాయించనున్నది. ప్రభుత్వరంగ టెలికం సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గతంలో కేంద్రం స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) స్కీంను ప్రకటించిన విషయం తెలిసిందే.
జీఎస్టీ @ 1.40 లక్షల కోట్లు
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్ళు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గడిచిన నెలకుగాను రూ.1.40 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ చారిత్రాత్మక పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో ఇంతటి భారీ స్థాయిలో పన్ను వసూలవడం ఇదే తొలిసారి. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నదని మంత్రి చెప్పారు. జనవరి నెలలో రూ.1,40,986 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు, కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్నదనడానికి ఈ గణాంకాలే నిదర్శణమని మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్ 2021లో రూ.1,39,708 కోట్ల మేర పన్ను వసూలైన విషయం తెలిసిందే.
6.9 శాతానికి ద్రవ్యలోటు
పెట్టుబడులు, రాబడుల మధ్య అంతరం అంతకంతకు పెరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బడ్జెట్లోనూ ఇదే విషయం స్పష్టమవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీలో ద్రవ్యలోటు 6.9 శాతానికి చేరుకోనున్నదని అంచనా. వచ్చే ఏడాది మాత్రం లోటును 6.4 శాతానికి కట్టడి చేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది. గతంలో 6.4 శాతానికి తగ్గిస్తామని లక్ష్యంగా పెట్టుకున్న నరేంద్ర మోదీ సర్కారుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2022-23లో ద్రవ్యలోటు రూ.16,61,196 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా.
డిజిటల్ బ్యాంకులు
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకులను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తాయని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్ను పెంచాలన్న ఉద్దేశంతో వీటిపై ఎటువంటి చార్జీలను అమలు చేయడం లేదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాకో డిజిటల్ బ్యాంక్ను తేవాలని మోదీ సర్కారు చూస్తున్నది.
బ్యాంకింగ్లోకి పోస్టాఫీసులు
దేశంలోని మొత్తం 1.5 లక్షల తపాలా కార్యాలయాలు.. బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం కానున్నాయని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో ప్రజలంతా తమ ఆన్లైన్ ఖాతా సేవలను వినియోగించుకోవచ్చని, పోస్టాఫీస్ ఖాతాల పరిధిలో ఇతర బ్యాంకులకు నగదు బదిలీ కూడా చేసుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా రైతులు, వృద్ధులకు ఇది కలిసి వస్తుందన్నారు.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 5,020 కోట్లు
కేంద్ర బడ్జెట్(2022-23)లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు రూ.5,020.05 కోట్లు కేటాయించారు. మంగళవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. గత బడ్జెట్ (2021-22)లో ఈ శాఖకు రూ.4,346.45 కోట్లు కేటాయించారు. ఈసారి రూ.5,020.50 కోట్లు కేటాయించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. కానీ, కేంద్రం రూ.5020.05 కోట్లు కేటాయించింది. అయితే, గత ఏడాది కంటే రూ.674 కోట్లు అదనంగా కేటాయించింది. ఇందులో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కోసం రూ.1,425 కోట్లు, పోస్ట్ మెట్రిక్ కోసం రూ.515, స్కిల్ డెవలప్మెంట్, ఇతర జీవనోపాధి పథకాల కోసం రూ.491 కోట్లకుపైగా కేటాయించారు. బడ్జెట్పై కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ముఖ్తార్అబ్బాస్ నఖ్వీ హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ దేశ స్వావలంబనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.