(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : దేశంలో 73 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. గుర్తింపుతో సంబంధం లేని వాటిని కలుపుకొంటే ఈ సంఖ్య 2 వేలు దాటుతుంది. అయితే, ఏండ్లుగా మనుగడ సాగిస్తున్న ఈ పార్టీలలో ఓ పది, పదిహేను మినహా మిగతా పార్టీల పేర్లేంటో కూడా ఎవ్వరికీ తెలియదు. అయితే, నాలుగు రోజుల కిందట సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య రాజకీయ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తున్నది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), కాన్వా డిజైన్ల సాయంతో రాత్రికి రాత్రే ఏర్పాటైన ఈ పార్టీకి ఇన్స్టాగ్రామ్లో కేవలం 96 గంటల్లోనే ఏకంగా 55 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరారు. ఆ పార్టీ పేరే ‘కాక్రోచ్ జనతా పార్టీ’.
అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్న 30 ఏండ్ల భారతీయ విద్యార్థి అభిజీత్ దీప్కే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)ని ఈ నెల 16న స్థాపించాడు.‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ (సోమరితనం)’ తమ పార్టీ నినాదమని ప్రకటించాడు. తమ పార్టీ యువత కోసం పని చేస్తుందని, ప్రజల సొమ్ము ఎటు పోతుందో నిలదీయటానికి పార్టీ పెట్టామని తెలిపాడు. అంతేకాదు తమ పార్టీకి ఒక రాజ్యాంగం, ప్రత్యేక వెబ్సైట్, ఐదు సూత్రాల మ్యానిఫెస్టో కూడా ఉన్నట్టు వెల్లడించాడు.
నిరుద్యోగులు సోమరిపోతుల్లా, బొద్దింకల్లా, పారాసైట్లా తయారై.. జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీజేఐ పేర్కొన్నప్పటికీ, ఆ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగానే అభిజీత్ దీప్కే.. సీజేపీని స్థాపించినట్టు తెలిపాడు.
ఉద్యోగం లేకపోవడం, సోమరితనం (భౌతికంగానే.. మానసికంగా కాదు), ఆన్లైన్కు (ఫోన్కు, సోషల్ మీడియాకు) కనీసం 11 గంటలపాటు అతుక్కొని ఉండటం, వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్భుతంగా వెళ్లగక్కే నైపుణ్యం కలిగి ఉండటం తమ పార్టీలో చేరటానికి అర్హతలుగా అభిజీత్ పేర్కొన్నాడు. మ్యానిఫెస్టో కూడా సంచలనమే తాము అధికారంలోకి వస్తే చేపట్టే విధులు ఏమిటో తెలిపే ఐదు అంశాల మ్యానిఫెస్టోను సీజేపీ ప్రకటించింది.
1. పదవీ విరమణ చేసే ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్త్తికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇవ్వబోం.
2. నిజమైన ఓటరు ఓటు హక్కు కోల్పోతే, దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఉపా చట్టం కింద అరెస్టు చేసి విచారణ జరుపుతాం.
3. పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తాం. కేంద్ర క్యాబినెట్లో సగం పదవులు మహిళలకు ఇస్తాం.
4. అదానీ, అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తాం. గోదీ మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు జరిపిస్తాం. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పని చేయటానికి బాటలు వేస్తాం.
5. పార్టీ ఫిరాయించే ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకుండా 20 ఏండ్లపాటు నిషేధం విధిస్తాం.
సీజేపీపై పలువురు రాజకీయ నేతలు తమదైన శైలిలో స్పందించారు. బీజేపీ మద్దతుదారులు తన మీద చేసే ఆరోపణలను వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ.. ‘నాకు యాంటీ నేషనల్ పార్టీ సభ్యత్వం ఉంది. మీతో కలిసి పని చేయవచ్చా?’ అని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా సీజేపీ ప్రతినిధులను అడిగారు. దీనికి సీజేపీ బదులిస్తూ.. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడే యోధురాలైన మీకు స్వాగతం’ అంటూ జవాబిచ్చింది. అలాగే, టీఎంసీ మరో ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్.. సీజేపీలో చేరటానికి అర్హతలేమిటి అని ప్రశ్నించగా.. ‘1983 క్రికెట్ వరల్డ్ కప్ను గెల్చుకోవటానికి మించిన అర్హత ఏముంటుంది?’ అని సమాధానమిచ్చింది. సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ సీజేపీ అజెండాకు కొన్ని అదనపు అంశాలను సూచించారు. సమాచారహక్కు చట్టం కింద ప్రజలకు పార్టీ జవాబుదారీగా ఉండాలని, ఎలక్టోరల్ బాండ్స్తో సహా అజ్ఞాతవ్యక్తులు ఇచ్చే సీక్రెట్ కాక్రోచ్ కేర్స్ ఫండ్ విరాళాల్ని స్వీకరించకూడదంటూ పేర్కొన్నారు. వీటికి సీజేపీ మద్దతు తెలపటమే కాదు.. తమ మ్యానిఫెస్టోలో భాగం చేస్తున్నామని పేర్కొన్నది.
ఢిల్లీలో ప్రవహిస్తున్న యమునా నది ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యానికి చిరునామాగా మారింది. ప్రభుత్వాలు మారినా యమున దుస్థితి మాత్రం మారలేదు. ఈ క్రమంలో కొందరు యువకులు భుజానికి సంచీలు వేసుకొని యమునా నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేయడం కనిపించింది. వారి టీషర్టుల మీద బొద్దింకల గుర్తులతో కూడిన ఫ్లకార్డులు, కాగితాలు అంటించి ఉండటం పలువురిని ఆకర్షించింది. దీంతో సీజేపీ కార్యకర్తలు అప్పుడే రంగంలోకి దిగారా? అని సోషల్మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
సీజేపీకి పోటీగా ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’ (ఎన్పీఎఫ్) రంగంలోకి దిగింది. పరాన్నజీవులుగా ముద్రపడిన సామాన్యుల తరఫున తాము పోరాడుతామని ఈ పార్టీ ప్రకటించింది. ‘వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం కోసం ఈ విరిగిపోయిన వ్యవస్థకే తాము అతుక్కుపోతామం’టూ ఎన్పీఎఫ్ వెబ్సైట్లో రాసుకొచ్చింది. పార్లమెంట్లో నేరస్థులు ఉండకూడదని, చదువుకొన్న ప్రజాప్రతినిధులు రావాలని, చిన్న వర్షానికి నదులుగా మారే రోడ్లు కనిపించకూడదన్నది ఈ పార్టీ ప్రధాన డిమాండ్లు.
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన అధికార పార్టీలు కాకపోయినప్పటికీ, దేశంలోని నిరుద్యోగ యువత ఆవేదనను, వ్యవస్థపై వారిలో రగులుతున్న అసంతృప్తిని డిజిటల్ వేదికగా చాటి చెప్పడమే సీజేపీ, ఎన్పీఎఫ్ పార్టీల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీజేపీ, ఎన్పీఎఫ్లో చేరుతున్న వారిని చూస్తుంటే దేశంలో ఒక విధంగా జెన్జీ ఉద్యమం ప్రారంభమయ్యిందా? అనే అనుమానం కలుగుతున్నదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.