న్యూఢిల్లీ: పీజీ వైద్య విద్యార్థులు ఇక నుంచి ఫుల్టైం రెసిడెంట్ డాక్టర్లుగా పనిచేయాల్సి ఉంటుందని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త నిబంధనావళిని విడుదల చేసింది. సహేతుకమైన పనిగంటలు, సరిపడా విశ్రాంతి వారికి కల్పించనున్నట్టు పేర్కొన్నది. ఈ మేరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్, 2023ను నోటిఫై చేసింది. ‘వారంలో ఒక రోజు సెలవు. ఏడాదిలో కనీసం 20 వరకు సాధారణ సెలవులుంటాయి. విద్యా సంవత్సరంలో మరో 5 రోజులు సెలవులు ఉంటాయి.’
అని ఎన్ఎంసీ తెలిపింది. ఒకవేళ మరిన్ని సెలవులు వైద్య విద్యార్థి కోరినట్టయితే, ఆ మేరకు కోర్సు కాలవ్యవధి పెరుగుతుందని, శిక్షణా కాలాన్ని పొడిగించి.. పూర్తిచేయాల్సి ఉంటుందని తాజా నిబంధనల్లో పేర్కొన్నది. 80 శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. కొత్త నిబంధనల నేపథ్యంలో, మెడికల్ కాలేజీలు పీజీ వైద్య విద్యార్థులకు రెసిడెన్షియల్ వసతిని ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. అయితే కాలేజీ హాస్టల్లోనే విద్యార్థి ఉండటం తప్పనిసరి కాదు. పీజీ మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి ‘నేషనల్ ఎగ్జిట్ టెస్ట్’ అమల్లోకి వచ్చే వరకు ‘నీట్-పీజీ’ పరీక్షలు కొనసాగుతాయని ఎన్ఎంసీ పేర్కొన్నది. యూజీ మెడికల్ కాలేజీలు ఇక నుంచి మూడో ఏడాది నుంచే పీజీ కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ, మౌలిక వసతులను ఏర్పాటుచేసుకుంటే.. జిల్లా దవాఖానలు, చిన్న చిన్న దవాఖానలు నేరుగా పీజీ కోర్సులు ఆఫర్ చేయవచ్చునని తెలిపింది.