కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ క్యాంటీన్లో అధికారులు మెనూను మార్చేశారు. సరికొత్త వంటకాలు, పదార్థాలను చేరుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. మరింత రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించడానికే మెనూలో మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సమోసాలు, ఫ్రైడ్ రైస్, బ్రెడ్ పకోడా లాంటి వాటిని పక్కన పెట్టేశారు.
కొత్తగా ప్రకటించిన మెనూలో మిల్లెట్ రోటీ, రాగి సిర, రజ్మా రాప్స్ (రోల్స్), రైస్ ఢోక్లా, ఆయుర్వేదిక్ కిచ్డీ, పాపడ్, సలాడ్తో పాటు పండ్లను అందిస్తున్నారు. దీంతో పాటు టిబెటన్ హెల్త్ డ్రింక్ అయిన సంపాను కూడా ఈ మెనూలో చేర్చారు. అంతేకాకుండా ఆయుశ్ ఆహార్ పేరుతో ఓ కొత్త క్యాంటిన్ కూడా ప్రారంభించారు. అందులో వెజిటెబుల్ పోహా, భజనీ వడ, గాజర్ హల్వాతో పాటు కుంకుమ పదార్థంతో చేసిన జావ లాంటి పదార్థాన్ని మెనూలో ఉంచారు.