న్యూఢిల్లీ: ఆన్లైన్ న్యూస్ పబ్లిషర్స్ కోసం ఇండియా తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు సెర్చ్ ఇంజిన్ అయిన తమకు వర్తించవని గూగూల్ ఎల్ఎల్సీ వాదిస్తోంది. తమకు ఈ చట్టం వర్తిస్తూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టాలని బుధవారం ఢిల్లీ హైకోర్టును గూగుల్ కోరింది. తాము మధ్యవర్తులమే అయినా.. సోషల్ మీడియా మధ్యవర్తులం కాదని చెబుతూ.. ఏకసభ్య ధర్మాసనం తన తీర్పులో తమను సోషల్ మీడియా మధ్యవర్తిగా గుర్తించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ మహిళ ఫొటోలను పోర్న్ సైట్ల నుంచి తొలగించడానికి సంబంధించిన కేసులో గూగుల్ తన వాదనలను వినిపించింది.
గూగుల్ వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ ప్రభుత్వం, ఫేస్బుక్, పోర్న్ సైట్, సదరు మహిళ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. జులై 25లోగా గూగుల్ వాదనలపై అభిప్రాయాలు తెలపాలని అందులో ఆదేశించింది. ఏకసభ్య ధర్మాసనం తమపై కొత్త చట్టాలను తప్పుగా వర్తింపజేశారని గూగుల్ వాదిస్తోంది.