New flight: శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు కొద్ది రోజుల ముందు అయోధ్య నగరం నూతన హంగులు సమకూర్చుకుంటున్నది. ఇప్పటికే విమానాశ్రయం, రైల్వే జంక్షన్ ప్రారంభం కావడంతో అయోధ్య ప్రత్యేక శోభను సంతరించుకున్నది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభమైన విమానాశ్రయానికి ఇప్పుడు క్రమంగా విమాన సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు.
అందులో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇవాళ రెండు కొత్త విమానాలను ప్రారంభించారు. అందులో ఒకటి అయోధ్య – బెంగళూరు విమానం కాగా, మరొకటి అయోధ్య – కోల్కతా విమానం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా లక్నోలో జరిగిన ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సింథియా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ జనాభా అమెరికా జనాభాలో 70 శాతానికి సమానంగా ఉందని, అదే యూరప్ దేశాల జనాభాలో సగానికి సమంగా ఉందని సింథియా చెప్పారు. గతంలో ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి కుంటుపడిందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా అభివృద్ధి జరుగుతోందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు.