న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశంలో మరో రైలు ప్రమాదం జరిగింది. దర్భంగా ప్రత్యేక ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని ఇటావాలో న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్లోని మూడు బోగీలు బుధవారం సాయంత్రం మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదని ఇటావా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. రైల్వే సీపీఆర్ఓ హిమాన్షు ఉపాధ్యాయ్ కథనం ప్రకారం.. న్యూఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగాకు వెళుతుండగా.. సాయంత్రం 5.30 గంటలకు ఈటావాకు సమీపంలోని సరయ్ భోపట్ జంక్షన్ వద్ద ఎస్-1 కోచ్ నుంచి పొగ వస్తున్న విషయాన్ని గమనించిన గార్డు రైలును ఆపారు.
అప్పటికే బోగీల్లో మంటలు వ్యాపిస్తుండటాన్ని గమనించి ప్రయాణికులంతా భయంతో కిందకు దిగారు. వారు దిగిన కొద్ది సేపటికి మంటలు మరింత పెద్దవై ఒక బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరో రెండు బోగీలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో పలువురి లగేజీ మంటల్లో కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నట్టు ఆయన చెప్పారు.