Supreme Court | కేంద్రం కొత్తగా తీసుకొని మూడు క్రిమినల్ చట్టాల అమలుపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకువచ్చిన చట్టాలకు ఇటీవల పార్లమెంట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లులను ఆమోదించగా చట్టాలుగా మారాయి. భారతీయ శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యాధార చట్టం స్థానంలో భారతీయ సాక్ష్యా సంహిత చట్టాలను కేంద్రం తీసుకువచ్చింది.
ఆయా చట్టాలను సవాల్ చేస్తూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. మూడు క్రిమినల్ చట్టాలను పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. చట్టాల్లో అనేక లోపాలు ఉన్నాయన్నారు. క్రిమినల్ చట్టాలకు సంబంధించిన బిల్లులు చాలా మంది ఎంపీలు సస్పెన్షన్లో ఉన్న సమయంలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారన్నారు. మూడు క్రిమినల్ చట్టాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాదులు, న్యాయనిపుణులతో కూడిన నిపుణుల కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని పిల్లో కోరారు.