న్యూఢిల్లీ : ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే కర్నాటకలోని కోలార్లో ఆయన పోస్టర్ను దుండగులు చించివేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు నిరసనగా పార్టీ కార్యకర్తలు వక్కలేరి రోడ్డును బ్లాక్ చేశారు. ఖర్గే పోస్టర్ చించివేతతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధతి అదుపులోకి తీసుకువచ్చారు.
పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టేముందు ఖర్గే రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. పార్టీ ఎదుగుదలకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని, సవాళ్లను కార్యకర్తలు, నేతలతో కలిసి దీటుగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
పార్టీ కష్టకాలంలో ఉందని కాంగ్రెస్కు జవసత్వాలు నింపేందుకు అందరం కృషి చేయాలని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ముంచుకొచ్చిందని, ఈ సవాల్ను మనం ఎదుర్కోవాల్సి ఉందని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.