CDS | చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకున్నదని సమాచారం. త్రివిధ దళాల నుంచి వచ్చిన సిఫారసు మేరకు త్వరలోనే అర్హుల జాబితాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సమర్పిస్తామని డిఫెన్స్ అధికారులు తెలిపారు. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ వారసుడి ఎంపికకు సైన్యం, ఎయిర్ఫోర్స్, నౌకాదళం అధికారులతో కూడిన ప్యానెల్ను ప్రభుత్వం ఖరారు చేస్తుందన్నారు. ఈ ప్యానెల్ సిఫారసు చేసిన పేర్లను రాజ్నాథ్ సింగ్కు పంపుతామన్నారు. ఆయన ఆమోదం తర్వాత సీడీఎస్ను ఎంపిక చేయడానికి కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా, ఓ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ తదుపరి సీడీఎస్ ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పారు.
అయితే ఆర్మీ చీఫ్, త్రివిధ దళాల అధిపతుల కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జనరల్ ఎంఎం నరవణేకే సీడీఎస్ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తున్నది. 2019 డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్గా బిపిన్ రావత్ నుంచి జనరల్ నరవణె బాధ్యతలు స్వీకరించారు. 2022 ఏప్రిల్ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత ఎయిర్ఫోర్స్ చీఫ్ మార్షల్ వివేక్ రాం చౌదరి గత సెప్టెంబర్ 30న, నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ గత నెల 30న బాధ్యతలు చేపట్టారు. కనుక సీనియారిటీ రీత్యా సీడీఎస్గా నరవణె నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ నెల 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.