Union Cabinet | కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా రాజస్థాన్లోని కోట-బుండిలో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రూ.1,507 కోట్లతో ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించనున్నారు. ఒడిశాలోని కటక్-భువనేశ్వర్లలో ఆరు లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.8,307 కోట్లు ఖర్చవుతుంది. మొత్తం రూ.9,814 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. రాజస్థాన్ ప్రభుత్వం కోట-బుండి విమానాశ్రయానికి ఉచితంగా భూమిని ఇస్తుందని తెలిపారు. ఈ ఎయిర్పోర్ట్ను రూ.1,507 కోట్ల అంచనా వ్యయంతో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మంగళవారం మంత్రివర్గం ఆమోదించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిధులు సమకూరుస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు. విమానాశ్రయం కోసం 1,089 ఎకరాల భూమిని రాజస్థాన్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని మంత్రి చెప్పారు. కొత్త విమానాశ్రయం సంవత్సరానికి 20 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. ఈ విమానాశ్రయం ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని వైష్ణవ్ అన్నారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తన అంతర్గత వనరుల నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తుందని.. 24 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. గత 11 సంవత్సరాల్లో దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 నుంచి 2025లో 162కి రెట్టింపు అయ్యిందని ఆయన అన్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య కూడా 2014లో 16.8 కోట్ల నుంచి ఈ సంవత్సరం 41.2 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు వివరించారు.