న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇండియా గేట్ వద్ద 28 అడుగులతో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి తెలంగాణలోని ఖమ్మం గ్రానైట్ను వాడారు. 280 మెట్రిక్ టన్నుల బరువున్న 100 అడుగుల గ్రానైట్ రాయిని (ఏకశిల) ఢిల్లీకి తరలించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని మేడిదపల్లి గ్రామంలో ఉన్న రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ గ్రానైట్ వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కి చెందిన క్వారీ నుంచి తీసుకెళ్లారు.
మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్యోగి రాజ్ బృంద సభ్యులు ఈ రాయిని విగ్రహంగా మలిచారు. దీన్ని 56 టన్నులతో రూపొందించారు. కాగా, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు పునరుద్ధరించిన మార్గం ‘కర్తవ్యపథ్’ను ప్రధాని గురువారం ప్రారంభించారు. ‘బానిసత్వానికి చిహ్నమైన రాజ్పథ్ ఇకపై చరిత్రగా మిగిలిపోనున్నది. కర్తవ్యపథ్ ద్వారా కొత్త చరిత్ర పురుడుపోసుకున్నది. నేతాజీ విగ్రహం ఇక నుంచి దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అన్నారు. నేతాజీ పథంలో భారత్ నడిచి ఉంటే మరింత అభివృద్ధి చెంది ఉండేదని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఆయనను విస్మరించారని, ప్రస్తుత ప్రభుత్వ చేతల్లో ఆయన ఆశయాలు, కలలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. అమృత మహోత్సవాలు జరుపుకొంటున్న వేళ దేశం నూతన ఉత్తేజాన్ని, ప్రేరణ పొందుతున్నదని చెప్పారు.