Chandrayaan-3 | కోట్లాది భారతీయులతోపాటు యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఇప్పటివరకూ ఎవరూ చేరని చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లిపై అడుగుపెట్టనుంది. నేటి సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై కాలు మోపనున్నది.
అంతా సవ్యంగా సాగితే చంద్రుడిపై సాఫ్ట్ల్యాండింగ్ చేపట్టిన నాలుగో దేశంగా భారత్ నిలువనున్నది. అలాగే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనున్నది. ప్రయోగం విజయవంతమై అంతరిక్ష యవనికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని యావత్ భారతావని ప్రార్థిస్తున్నది. రష్యా ప్రయోగించిన లూనా-25 మిషన్ నాలుగు రోజుల క్రితం చివరి దశలో కుప్పకూలడంతో ఇక అందరి కండ్లూ చంద్రయాన్పై నిలిచాయి. సాఫ్ట్ల్యాండింగ్ కార్యక్రమాన్ని ఇస్రో, టీశాట్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
బెంగళూరు, ఆగస్టు 22: చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం చివరి అంకానికి చేరుకుంది. వ్యోమనౌక బుధవారం సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనున్నది. సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడిపై కాలుమోపనున్నది. ఈ చారిత్రక క్షణాల కోసం యావత్ భారతావనితోపాటు ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది. ఒక వేళ ప్రతికూల పరిస్థితులు తలెత్తితే సాఫ్ట్ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27కు వాయిదా వేయనున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఆ 20 నిమిషాలు..
ల్యాండింగ్కు ముందు మాడ్యూల్లోని అన్ని పారామీటర్లను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత నిర్దేశించుకొన్న ప్రాంతంలోచంద్రుడిపై సూర్యోదయం వరకు ఎదురుచూస్తారు. ల్యాండింగ్ ప్రక్రియ సరిగ్గా సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభమై 6.04 గంటలకు ముగుస్తుందని అంచనా. దీనినే ‘20 నిమిషాల టెర్రర్’గా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్ మాడ్యూల్ సరైన ఎత్తులో, సరైన సమయంలో సరిపడా ఇంధనాన్ని వినియోగించుకొని తనకు తానుగానే ఇంజిన్లను మండించుకోవాల్సి ఉంటుంది. ఎత్తుపల్లాలు లేని ఉపరితలంపై దిగే ప్రాంతాన్ని కూడా కెమెరాతో స్కాన్ చేసుకొని దిగుతుంది. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రతి అడుగు కీలకమే. చంద్రుని ఆకర్షణశక్తికి అనుగుణంగా ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకుంటూ వేగాన్ని తగ్గించుకుంటుంది. ఆ తరువాత 11 నిమిషాలపాటు రన్ బ్రేకింగ్ దశ మొదలవుతుంది. ఈ దశలో ల్యాండర్ చంద్రునికి సమాంతరంగా నిలుస్తుంది. క్రమంగా ఫైన్ బ్రేకింగ్ దశలోకి వస్తుంది. దిగేందుకు అనువుగా ల్యాండర్ 90 డిగ్రీల వంపు తిరుగుతుంది. క్రితంసారి చంద్రయాన్-2 ఈ దశలోనే కూలిపోయింది. ఈ దశల అనంతరం ల్యాండర్ చంద్రునికి కేవలం 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అప్పుడు దాని వేగం సున్నాకు చేరుతుంది. అలా మెల్లిగా 150 మీటర్ల ఎత్తుకు చేరగానే దిగేందుకు సరైన ప్రదేశం కోసం ల్యాండర్ వెతుకుతుంది. అనువైన స్థలం దొరకకగానే అక్కడ సెకనుకు మూడు మీటర్ల వేగంతో చంద్రుని ఉపరితలాన్ని తాకుతుంది. ఈ విధంగా చివరి 20 నిమిషాల ఉత్కంఠకు తెరపడి మిషన్ విజయవంతం అవుతుంది. ఆ తర్వాత 14 రోజుల పాటు మామ ఇంట గడుపుతుంది.
ఓటమి నుంచి నేర్చుకొన్న పాఠాలతో..
చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లిపై అడుగు పెడితే.. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. ఈ జాబితాలో అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ సరసన మన దేశం సగర్వంగా నిలుస్తుంది. నాలుగేండ్ల వ్యవధిలో ఇది చంద్రుడిపై భారత్ చేసిన రెండో ప్రయోగం కావడం విశేషం. 2019లో పంపిన చంద్రయాన్-2 లక్ష్యానికి సమీపంలో, చివరి క్షణాల్లో విఫలమైన విషయం తెలిసిందే. అనుకోని విధంగా ఎదురైన ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొన్న ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు పట్టుదలతో చంద్రయాన్-3కి శ్రీకారం చుట్టారు. రూ.600 కోట్ల బడ్జెట్తో గత నెల 14న ఏపీలోని శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ స్పేస్క్రాఫ్ట్, నిర్దేశించిన విధంగా అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తూ.. వడివడిగా జాబిల్లి వైపు అడుగులు వేస్తూ వచ్చింది. కొన్ని రోజుల్లో భూమి కక్ష్యల్లో, తర్వాత చంద్రుడి కక్ష్యల్లో తిరిగి, ఇప్పుడు చందమామకు మరింత చేరువైంది.
సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ సాగుతుంది ఇలా..
చంద్రయాన్-3 తర్వాత వరుస ప్రయోగాలు
బెంగళూరు, ఆగస్టు 22: చంద్రయాన్-3 తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వరుస ప్రయోగాలు చేపట్టనున్నది. సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య-ఎల్1, మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో భాగంగా టెస్ట్ వెహికిల్ ప్రయోగాలతోపాటు నాసాతో కలిసి అభివృద్ధి చేసిన ‘నిసార్’.. మొదలైన ప్రయోగాలను ఇస్రో చేపట్టబోతున్నది. మంచు, సముద్రమట్టం, భూగర్భ జలం, భూకంపాలు సహా భూమిపై ఎకోసిస్టమ్ మార్పులంతటినీ ‘నిసార్’ రికార్డ్ చేసి పంపుతుంది.
షెడ్యూల్ ప్రకారమే మిషన్
షెడ్యూల్ ప్రకారమే చంద్రయాన్-3 మిషన్ జరుగుతుందని ఇస్రో వెల్లడించింది. వ్యవస్థలను నిరంతరం చెక్ చేస్తున్నామనిపేర్కొన్నది. మరోవైపు ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఐఎస్టీఆర్ఏసీ)లోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్(ఎంవోఎక్స్)లో జరిగే ల్యాండింగ్ ఆపరేషన్లను బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తామని తెలిపింది.