బీహార్, మార్చి 20: బీహార్ సీఎం నితీశ్ కుమార్తో కలిసి తాను సంతోషంగా పనిచేస్తున్నట్టు డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో తేజస్వీ మాట్లాడుతూ.. ‘గత ఏడాది ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు రావాలని నితీశ్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నా. నా మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నిలబెట్టాలనుకుంటున్నాను. ప్రధాని కావాలని ఆయన, ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకోవడం లేదు, ఎక్కడ ఉన్నా మేమిద్దరం సంతోషంగా ఉంటాం. మా మధ్య ఏవో విభేదాలు, అగాధం ఉందని విపక్షాలు ఊహల్లో విహరిస్తున్నాయి’ ఆని వ్యాఖ్యానించారు. తనతో సహా దేశంలోని పలువురు నేతలను అవినీతి, మనీలాండరింగ్ తదితర ఆరోపణలతో కేంద్రంలోని బీజేపీ వేధింపులకు గురి చేస్తున్నదని తేజస్వీయాదవ్ విమర్శించారు.