భోపాల్: ఎంకి పెండ్లి సుబ్బి సావుకు వచ్చిందంటే ఇదేనేమో..! చికెన్ విషయంలో భర్త భార్య ఇద్దరూ గొడవ పడుతుంటే సర్దిచెప్పేందుకు మధ్యలో వెళ్లిన పాపానికి పక్కింటి వ్యక్తి హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నగర పరిసరాల్లోని బిల్ఖిరియా పోలీస్ స్టేషన్ పరిధిలోగల చవానీ పతర్ గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన పప్పు అహిర్వార్ అనే వ్యక్తి ఇంటికి చికెన్ తీసుకొని వెళ్లాడు. అయితే ఆ చికెన్ వండేందుకు భార్య ఒప్పుకోలేదు. దాంతో ఆగ్రహించిన పప్పు అహిర్వార్ ఆమెపై దాడి చేశాడు. భర్త దెబ్బలు తాళలేక భార్య గట్టిగా అరుస్తూ బయటికి పరుగులు తీయడంతో ఇరుగుపొరుగు అంతా జమయ్యారు.
పప్పు అహిర్వార్కు సర్ది చెప్పి అంతా ఎవరిండ్లకు వాళ్లు వెళ్లిపోయారు. తర్వాత పప్పు అహిర్వార్ తన ఇంట్లో ఉన్న దుడ్డుకర్ర తీసుకుని పక్కింట్లో ఉండే బబ్లూ అహిర్వార్ ఇంటికి వెళ్లాడు. వెళ్లగానే ఎదురుగా ఉన్న బబ్లూ తలపై కర్రతో బలంగా కొట్టడంతో తలపగిలి స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పప్పు అహిర్వార్ను అదుపులోకి తీసుకున్నారు. భార్యభర్తల గొడవ సందర్భంగా తనను తీవ్ర పదజాలంతో మందలించాడన్న కారణంతోనే పప్పు అహిర్వార్.. బబ్లూ అహిర్వార్పై దాడికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.