Rahul on Power Crisis | దేశంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ఎవరిని నిందిస్తారని ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతోపాటు పలు రాష్ట్రాలను విద్యుత్ సంక్షోభం కుదిపేస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కరంట్ కోతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ విమర్శలు గుప్పించారు.
ఈ విద్యుత్ సంక్షోభంలో వైఫల్యానికి ఎవరిని నిందిస్తారని ప్రధాని మోదీని రాహుల్ ప్రశ్నించారు. మాజీ ప్రధాని నెహ్రూనా? రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తారా.. ప్రజలనే నిందిస్తారా అంటూ శనివారం ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వాగ్దానాలకు, ఉద్దేశాలకు మధ్య సంబంధం లేదన్నారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా 24 గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంచుతామని 2015లో.. 2017లో బొగ్గు సంక్షోభ వార్తలు కనిపించడం లేదని మోదీ చేసిన ప్రసంగాల వీడియోను రాహుల్ పోస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ కట్టిన గాలి మేడలు కూలిపోయాయని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. విద్వేష బుల్డోజర్లు నడుపడం ఆపి, విద్యుత్ ఫ్యాక్టరీలు పని చేసేలా చూడాలని సూచించారు. ఇదిలా ఉంటే, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పాలన, నిర్వహణాపర లోపాల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని కాంగ్రెస్ ఆరోపించింది.