(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): భారీ లాభాలు తెచ్చిపెడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్యూలను) తెగనమ్ముతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. క్రికెట్ స్టేడియాలను కూడా వదిలిపెట్టట్లేదు. ప్రభుత్వ ఆస్తుల నుంచి అదనపు ఆదాయ మార్గాలేమైనా (మానిటైజేషన్) ఉన్నాయో పరిశీలించాలని మూడు రోజుల క్రితమే వివిధ మంత్రిత్వ శాఖలకు సూచించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఢిల్లీలోని ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ క్రికెట్ స్టేడియంతో పాటు ఆసియాలోనే అతిపెద్ద ఇండోర్ స్టేడియంగా పేరుగాంచిన ఇందిరాగాంధీ స్టేడియాన్ని విక్రయించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఈ మేరకు క్రీడాశాఖకు ఉత్తర్వులు జారీచేసినట్టు ‘ఎకనమిక్ టైమ్స్’ ఒక కథనంలో పేర్కొన్నది. వీటితోపాటు గాంధీనగర్, భోపాల్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) రీజినల్ సెంటర్లను కూడా ఈ ఆర్థిక సంవత్సరమే మానిటైజ్ పైప్లైన్లోకి తీసుకురావాలని కేంద్రం సదరు శాఖను ఆదేశించినట్టు సమాచారం. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.1.6 లక్షల కోట్లు సేకరించాలని కేంద్రం లక్ష్యం పెట్టుకోగా.. గడిచిన 7 నెలల్లో రూ.33,443 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం మానిటైజ్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం క్రీడాశాఖ మానిటైజేషన్ లక్ష్యం రూ. 2,100 కోట్లు కాగా, పై ఆస్తుల విక్రయం ద్వారా ఆ శాఖకు రూ. 7,853 కోట్లు రావొచ్చని సమాచారం.
క్రీడాశాఖతో పాటు ఈ ఏడాది మినిస్ట్రీ ఆఫ్ పవర్కు రూ.15,308 కోట్లు, వినియోగదారుల మంత్రిత్వ శాఖకు రూ.8,670 కోట్లను కేంద్రం మానిటైజేషన్ లక్ష్యంగా పెట్టింది. ఆస్తుల విక్రయంపై దూకుడు పెంచాలని ఆయా శాఖలకు సూచించింది. బొగ్గుగనుల శాఖకు ఈ ఏడాది రూ.30 వేల కోట్ల మానిటైజేషన్ టార్గెట్ నిర్ణయించగా.. రూ.52 వేల కోట్ల లక్ష్యాన్ని చేరొచ్చని అంచనా. అలాగే, షిప్పింగ్ మినిస్ట్రీ మానిటైజేషన్ లక్ష్యం రూ.3,553 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ.12 వేల కోట్లకు చేరవచ్చని తెలుస్తున్నది.