న్యూఢిల్లీ: విదేశాల్లోని భారతీయులు (ఓసీఐ), భారతీయ మూలాలున్న (పీఐవో) కార్డుదారులకు సంబంధించి నీట్ యూజీ పరీక్ష అర్హత ప్రమాణాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సవరణలు చేసింది. ‘భారతీయులు, ఎన్నారైలు, ఓసీఐలు, ఐపీఓలు, విదేశీయులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా వైద్య/దంత/ఆయుర్వేద/సిద్ధ/యునాని/హోమియోపతి కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చని ఎన్టీఏ ప్రకటించింది.
గతంలో పీఐవో కార్డు కలిగినవారు, విదేశీయులు భారతీయులకు రిజర్వ్ అయిన సీట్లను పొందడానికి వీలుండేది కాదు. ఓసీఐ, ఐసీఐ కార్డుదారులను విదేశీయులుగా పరిగణించేవారు. వారికి ఎన్నారై సీట్లకు మాత్రమే అర్హత ఉండేది. ఎన్టీఏ తాజా సవరణల వివరాలను neet.nta.nic.in వెబ్సైట్లో చూడవచ్చు.