న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రస్తుత విధానంలో ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి అనుసరిస్తున్న ప్రక్రియ పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎన్నికల కమిషనర్ స్వతంత్రంగా వ్యవహరించాలని, అవసరమైతే ప్రధానమంత్రి మీద కూడా చర్య తీసుకోగలిగేవారై ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్ (ఈసీ) స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని, ఆయన స్వతంత్రంగా వ్యవహరించగలగాలని వ్యాఖ్యానించింది. అయితే ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో ఏ మేరకు పారదర్శకత పాటిస్తున్నారని ప్రశ్నించింది. అందువల్ల ప్రధాన ఎన్నికల కమిషర్ (సీఈసీ) నియామకం కోసం జరిగే సంప్రదింపుల ప్రక్రియలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా భాగస్వామిని చేయాలని సూచించింది. ఈసీ, సీఈసీల నియామకాల్లో సంస్కరణలు చేపట్టాలని, కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వంలో జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
‘ప్రస్తుత వ్యవస్థలో.. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమకు అనుగుణంగా వ్యవహరించే వ్యక్తినే సీఈసీగా నియమిస్తున్నది. కానీ ఆ వ్యక్తి స్వతంత్రంగా వ్యవహరించాలి. ఉదాహరణకు ప్రధానమంత్రిపై ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు సీఈసీ స్పందించగలగాలి.. కానీ ప్రస్తుత వ్యవస్థలో ప్రధానిపై చర్య తీసుకోలేరు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేయడం కాదా? అని ప్రశ్నించింది. సీఈసీ రాజకీయ ప్రభావాలకు దూరంగా, స్వతంత్రంగా పనిచేయాలని పేర్కొంది. ఎన్నికల కమిషన్ విషయంలో సమూల మార్పులు జరగాలని పలు కమిటీలు సూచిస్తున్నాయని, రాజకీయ నాయకులు కూడా గగ్గోలు పెడుతున్నారు తప్ప ఎటువంటి ఫలితం లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి చేపడుతున్న ప్రక్రియను వివరించాలని ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. సీఈసీ నియామక ప్రక్రియలో ప్రస్తుతం పాటిస్తున్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ బల్బీర్సింగ్ వాదనలు వినిపించారు.
సీఈసీ నియామకంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం సరైనదేనని, దానిని ప్రశ్నించాల్సిన అవసరం లేదని, కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ ప్రక్రియ 1991 నుంచి సావధానంగానే కొనసాగుతున్నదని తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఓ వ్యవస్థను లేదా సిఫారసుల కమిటీని ఏర్పాటుచేస్తే మళ్లీ అంతా మొదటికొస్తుందని అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఏ ప్రభుత్వమైనా తమకు ‘ఊ’కొట్టే ‘యస్ మ్యాన్’ను నియమించవచ్చు. అయితే ఆ వ్యక్తి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా లేదా అన్నదే మా ప్రశ్న. ఎన్నికల కమిషనర్లు లేదా సీఈసీ నియామకంలో సమ్మిళిత ప్రక్రియ అవసరం’ అని పేర్కొంది. ఎన్నికల కమిషనర్లలో సీనియర్ అయిన వ్యక్తిని సీఈసీగా నియమిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కార్యదర్శి లేదా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సివిల్ సర్వెంట్లను ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నామని వెంకటరమణి వివరించారు. దినేశ్ గోస్వామి కమిటీ చేసిన సిఫారసుల మేరకే 1991లో ఎలక్షన్ కమిషన్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిందని గుర్తుచేశారు. ‘మీరు చెప్తున్న 1991నాటి చట్టం ఎన్నికల కమిషనర్ల విధులను మాత్రమే సూచిస్తున్నది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ఒకవేళ ప్రభుత్వం తమ సిద్ధాంతాలకు, ఆలోచనలకు అనుగుణమైన ‘యస్ మ్యాన్’ను నియమించింది అనుకోండి.. అప్పుడు అతని పదవీకాలం, జీతభత్యాలకు సంబంధించిన అన్ని సదుపాయాలు చట్టం ద్వారా లభిస్తాయి. అంతే తప్ప ఆ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. ఇది ఎన్నికల కమిషన్.. దీనికి అన్ని రకాలుగా సంపూర్ణ స్వాతంత్య్రం ఉండాలి’ అని స్పష్టంచేసింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్గా అరుణ్గోయల్ నియామకానికి సంబంధించిన ఫైల్ను తమ ముందుంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన అరుణ్గోయల్ను ఎన్నికల కమిషనర్గా నియమించటం వెనుక ఏమైనా అవకతవకలు జరిగాయేమో తెలుసుకోవాలనుకుంటున్నామని కేఎం జోసఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. ఈసీ, సీఈసీల నియామకాలకు సంబంధించిన కేసును మనం విచారణ జరుపుతున్నామని, ఈ సమయంలో ఒక నియామకాన్ని ప్రత్యేకంగా చూడరాదని వెంకటరమణి పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఈసీ, సీఈసీల నియామకానికి కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కోర్టు గత గురువారం (నవంబర్ 17) నుంచి విచారణ జరుపుతున్నది. కానీ గోయల్ను ఈసీగా ఈ నెల 19న నియమించారు. అందువల్ల ఈ చర్యకు గల కారణాలను మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు అనుసరిస్తున్న పద్ధతి ఏమిటి? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించబోము. కానీ మీరు వాదిస్తున్నట్టు అన్నీ సవ్యంగా ఎలా జరుగుతున్నాయో మేం తెలుసుకోవాలి.
ఓ వైపు విచారణ జరుగుతుండగా, మరోవైపు నియామకం జరిగింది. ఇవి రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండవచ్చు. ఆ నియామక పత్రాలను కోర్టు ముందుంచండి’ అని తేల్చి చెప్పింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ‘అరుణ్ గోయల్ గురువారం (నవంబర్ 17) వరకూ ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి అధికారిగా పనిచేశారు. ఆకస్మికంగా ఆయనకు శుక్రవారం వీఆర్ఎస్ ఇచ్చి శనివారం ఎన్నికల కమిషనర్గా నియమించారు’ అని చెప్పారు. ఓ వ్యక్తి స్వచ్ఛంద పదవీ విరమణ ప్రక్రియ పూర్తవడానికి మూడు నెలల సమయం పడుతుంది కదా? అని జస్టిస్ జోసఫ్ పేర్కొన్నారు. 1985 బ్యాచ్, పంజాబ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అరుణ్గోయల్ వచ్చే డిసెంబర్ 31న రిటైర్ కావాల్సిఉంది. కానీ ఇప్పుడు ఆయ న ఎన్నికల కమిషనర్గా 2025 ఫిబ్రవరి వరకు కొనసాగనున్నారు. ఈ కేసుపై విచారణ గురువారం కూడా కొనసాగనుంది.