శ్రీనగర్: భారత్లోకి చొరబడేందుకు జమ్ముకశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి సుమారు 200 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం తెలిపారు. భారత్, పాకిస్థాన్ సరిహద్దులో పరిస్థితి గురించి మీడియాకు ఆయన వివరించారు. ఆరు ప్రధాన ఉగ్రవాద శిబిరాలు, 29 మైనర్ క్యాంపులు, వివిధ సైనిక స్థావరాలకు సమీపంలో తాత్కాలిక ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయని చెప్పారు. పాకిస్థాన్ ఆర్మీ ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాన్ని తోసిపుచ్చలేమన్నారు. కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్ చాలా ఫూల్ ప్రూఫ్ అని ఆర్మీ కమాండర్ అన్నారు.
కాగా, ఉగ్రవాదుల చొరబాట్లను ధీటుగా తిప్పికొడతామని ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. దీని కోసం రెండంచుల రక్షణగా రిజర్వ్ బలగాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. జమ్ముకశ్మీర్లో శిక్షణ పొందిన ఉగ్రవాదుల సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గుతున్నదని వివరించారు. సుమారు 40-50 మంది స్థానిక ఉగ్రవాదులతోపాటు కొందరు విదేశీ ఉగ్రవాదులు ప్రస్తుతం ఉన్నట్లు తెలిపారు. అయితే స్థానికుల సహాయం, మద్దతు లేకుండానే ఈ ఏడాది 21 మంది విదేశీ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు వెల్లడించారు.
మరోవైపు 2021 ఫిబ్రవరిలో జరిగిన ఒప్పందం మేరకు భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విమరణ బాగానే కొనసాగుతున్నదని జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. గత 12 నెలల్లో చాలా తక్కువగా కాల్పుల విమరణ ఉల్లంఘన జరిగిందని, ఒకటి నుంచి మూడు సార్లు జరిగి ఉండవచ్చని అన్నారు.