శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోకి చొరబడేందుకు సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి లాంచ్ప్యాడ్స్ వద్ద సుమారు 150 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారు. అలాగే సుమారు 500 నుంచి 700 మంది ఉగ్రవాదులు 11 శిబిరాల్లో శిక్షణ పొందుతున్నారు. నియంత్రణ రేఖ వెంబడి మన్షేరా, కోట్లి, ముజఫరాబాద్లో ఈ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ఆర్మీ అధికారి ఒకరు శనివారం తెలిపారు. అయితే ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను ధీటుగా తిప్పికొడుతున్నట్లు చెప్పారు. దీంతో ఈ ఏడాది సరిహద్దు నుంచి ఎలాంటి ఉగ్రవాద చొరబాట్లు జరుగలేదన్నారు. మే నెలాఖరు వరకు సరిహద్దులో అంతా బాగానే ఉందన్నారు. కశ్మీర్లోకి చొరబడిన తక్కువ సంఖ్యలోని విదేశీ ఉగ్రవాదులు బందిపోరా, సోపోర్ ఎన్కౌంటర్లలో హతమయ్యారని వెల్లడించారు.
కాగా, ఉగ్రవాదులు వినియోగిస్తున్న ప్రస్తుత చొరబాటు మార్గాలు భద్రతా దళాలకు తెలిసిపోయాయని ఆ ఆర్మీ అధికారి తెలిపారు. దీంతో ఉగ్రవాదులు ఇతర మార్గాల ద్వారా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే పటిష్ఠమైన నిఘా, బలగాల మోహరింపుతోపాటు ధృఢమైన కంచె వంటివి ఉగ్రవాదుల చొరబాట్లను నిరోధిస్తున్నాయని అన్నారు. దీంతో రాజౌరి-పూంచ్ మార్గాలు, పిర్ పంజాల్ దక్షిణ ప్రాంతాల నుంచి చొరబడేందుకు ఉగ్రవాదులు దృష్టిసారించినట్లు పేర్కొన్నారు.