Bచ్ – సౌరాష్ట్ర ప్రాంతాల మీదుగా వెళ్తున్న ఈ తుఫాను ఇప్పటికే తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది. అయితే ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టం లేకపోవడం ఊరటనిచ్చే వార్త అనే చెప్పాలి. తుఫాన్ తీరం దాటే సమయంలో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది తప్ప.. ప్రాణ నష్టం జరగలేదని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ అతుల్ కార్వాల్ వెల్లడించారు. కచ్ ప్రాంతంలో ఇద్దరు మరణించినప్పటికీ.. అది తుఫాను తీరం దాటడానికి ముందే జరిగిందని స్పష్టం చేశారు. కాకపోతే పలు ప్రాంతాల్లో 23 మందికి గాయాలయ్యాయని తెలిపారు.
తుఫాను కారణంగా దాదాపు 800 చెట్లు కూలిపోయాయని, 500 ఇండ్లు దెబ్బతిన్నాయని. వేల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. దీని ప్రభావం కచ్ జిల్లాలో ఎక్కువగా ఉందని.. దాదాపు 40 శాతం గ్రామాల్లో స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. అయితే తీరం దాటే సమయంలో తుఫాను సామర్థ్యం తక్కువగా ఉండటంతో నష్టం కొంతమేర తగ్గిందని తెలిపారు. ఇప్పటివరకు కచ్ జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ వెల్లడించారు. బిపర్జాయ్ తుఫాను తీరం దాటిన తర్వాత దాదాపు 54 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. భుజ్ పట్టణంలో దాదాపు 80 వేల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయని.. దీని కారణంగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు.
కాగా, తుఫాను తీరందాటిన పరిసర ప్రాంతాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. ద్వారకలోని ప్రాచీన ఆలయం సహా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను, గిర్ సోమ్నాథ్ జిల్లాలోని సోమ్నాథ్ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. . 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్టీఆర్ఎఫ్ బృందాలతోపాటు రోడ్లు,భవనాల శాఖకు చెందిన 115 బృంధాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో 99 రైళ్లను రైల్వే శాఖ రద్దుచేసింది.
కాగా, ప్రస్తుతం దక్షిణ రాజస్థాన్వైపు కదులుతున్న తుపాను.. సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో రాజస్థాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రాజస్థాన్ లోని బార్మర్, జాలోర్, జైసల్మేర్, జోధ్ పూర్, పాలి తదితర ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీపై కూడా తుఫాను ప్రభావం పడింది. అక్కడ కూడా ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.