న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగనున్నాయి. ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దిగగా.. అధికార బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును బరిలో నిలిపింది. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా 27న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగనుండగా.. 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ నెల 29తో గడువు ముగియనున్నది.
ఇదిలా ఉండగా.. ద్రౌపది ముర్ము గతంలో జార్ఖండ్కు మొదటి మహిళా గిరిజన గవర్నర్గా సేవలందించారు. మంగళవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ముర్ము పేరును బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. అయితే, ఈ సారి రాష్ట్రపతి అభ్యర్థి కోసం 20 మంది పేర్లను చర్చించగా.. మహిళ, గిరిజనులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు
.