(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి):ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. దళితుడైన ఈయన మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి. కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఒకవేళ సమీకరణాలు మారితే కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ లేదా పంజాబ్ మాజీ సీఎం అమరిందర్సింగ్ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. అభ్యర్థి ఎంపికపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశముంది. అనంతరం ఢిల్లీలో అభ్యర్థి పేరు ప్రకటించొచ్చు. మరోవైపు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును నిలబెడుతున్నట్టు బీజేపీ ముందుగా ఒక్కమాట చెప్పితే ఆమెకు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలించేవాళ్లమని శుక్రవారం బెంగాల్ సీఎం మమత పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమెకు ఫోన్ చేశారు. ముర్ముకు మద్దతు ఇవ్వాలని కోరారు.