జైపూర్: పోటీ పరీక్షకు హాజరైన యువతి స్లీవ్లను కత్తిరించడంపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (RAS) 2021 ప్రిలిమ్స్ పరీక్ష బుధవారం జరిగింది. బికనీర్లోని ఒక పరీక్షా కేంద్రంలో యువతి ధరించిన డ్రెస్ స్లీవ్స్ను సెక్యూరిటీ గార్డు కత్తెరతో కత్తిరించాడు.
మీడియాలో వచ్చిన దీనిపై స్పందించిన ఒక మహిళ జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో చైర్పర్సన్ రేఖా శర్మ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పరీక్షా కేంద్రం వద్ద మహిళా అభ్యర్థులను తనిఖీ చేయడానికి మహిళా సిబ్బందిని ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. దీనిపై కూడా వివరణ ఇవ్వాలని కోరారు.
కాగా, పోటీ పరీక్షలో అక్రమాలను నివారించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (RAS) 2021 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పూర్తి చేతులున్న డ్రెస్ ధరించవద్దని పేర్కొంది. ఈ నేపథ్యంలో పూర్తి చేతుల డ్రెస్ ధరించి పరీక్షా కేంద్రాలకు వచ్చిన మహిళా అభ్యర్థుల స్లీవ్స్ను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కత్తెరతో కత్తిరించారు.
మరోవైపు పూర్తి చేతుల చొక్కాలు ధరించిన కొందరు మగ అభ్యర్థులు షర్ట్ తీసి పరీక్ష రాయాల్సి వచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.